మచిలీపట్నం, జనవరి 30 (న్యూస్టైమ్): బదిలీల్లో వివిధ ప్రాంతాలకు చెందిన ఉపాధ్యాయులు నిబంధనలకు విరుద్ధంగా స్థానాలు ఎంచుకున్నారని కృష్ణా జిల్లా విద్యాశాఖాధికారి రాజ్యలక్ష్మి తొమ్మిది మందిని సస్పెండ్ చేస్తూ శనివారం ఉత్తర్వులు జారీ చేశారు. స్పౌజ్ కోటాలో భార్యాభర్తలు దగ్గరి స్థానాలు కోరుకోవాల్సి ఉంది. అయితే, దానికి విరుద్ధంగా వేర్వేరు స్థానాలు కోరుకున్నట్లు ఉపాధ్యాయుల నుంచి విద్యాశాఖకు ఫిర్యాదులు అందాయి. దీనిపై విచారణ నిర్వహించిన అనంతరం నిబంధనలను అతిక్రమించినట్లు నిర్ధరణ కావడంతో సస్పెండ్ చేసినట్లు డీఈవో తెలిపారు.
చందర్లపాడు మండలం ముప్పాళ్ల ప్రాథమిక పాఠశాలకు చెందిన కె.బేబీషాలినీ, చందర్లపాడు మండలం కొండపేట ప్రాథమిక పాఠశాల సీహెచ్ రత్నమాధురి, గన్నవరం జడ్పీహెచ్ఎస్ ఉపాధ్యాయిని డి.లావణ్య, మండవల్లి జడ్పీహెచ్ఎస్కు చెందిన జీవి నాగలక్ష్మి, తోట్లవల్లూరు మండలం రొయ్యూరు ప్రాథమికోన్నతపాఠశాలకు చెందిన ఎం.జ్యోతిర్మయి, కలిదిండి మండలం తాడినాడ జడ్పీహెచ్ఎస్కు చెందిన కె.శివఅంకమ్మ, మైలవరం-3 ప్రాథమిక పాఠశాల ఉపాధ్యాయుడు పి.రవిబాబు, మైలవరం మండలం కీర్తరాయునిగూడెం ప్రాథమిక పాఠశాలకు చెందిన కె.కృష్ణవేణి, విస్సన్నపేట ప్రాథమిక పాఠశాల ఉపాధ్యాయిని జి.రమణిలను సస్పెండ్ చేశారు.